మహేష్ మూవీపై హైపెక్కిస్తున్న RRR..!


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కరకాలం ముందు దర్శక హీరోల మధ్య ప్రారంభమైన చర్చలు ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు.

‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న.. RRR చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు ఇంకాస్త దూరంలో ఉండటం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇదంతా పరోక్షంగా మహేష్ – రాజమౌళి సినిమాపై ఇప్పటి నుంచే క్రేజ్ ఏర్పడేలా చేస్తోంది.

ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్శించిన తర్వాత మహేష్ బాబుతో ఓ గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీ చేయనున్నట్లు వెస్ట్రన్ కంట్రీస్ వేదికగా ప్రకటించారు జక్కన్న. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని.. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ సినిమా చేయనున్నట్లు తెలిపారు. దీంతో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా, ఇప్పటి వరకూ మహేష్ ఆ దిశగా ఆలోచన చేయలేదు. కానీ రాజమౌళి సినిమా అంటే అది కచ్చితంగా దేశ వ్యాప్తంగా అందరిని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తారు. అందులోనూ ఇప్పుడు RRR సినిమాతో అంతర్జాతీయంగా అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత, జక్కన్న దానికి ఏమాత్రం తగ్గకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేసే అవకాశం ఉంది. కాబట్టి మహేష్ తో దర్శకుడు చేయబోయే చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు RRR చిత్రానికి గాను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తర్వాత రాజమౌళి గురించి.. ఆయన డైరెక్ట్ చేసే తదుపరి మూవీ గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. అది తప్పకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని.. ఈసారి గ్లోబల్ మార్కెట్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా దర్శకధీరుడు ప్లాన్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు దుర్గా ఆర్ట్స్ నిర్మించే SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. రాజమౌళి ఇండియాకి తిరికొచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి కేంద్రీకరించనున్నారు. మరి జక్కన్న మరియు మహేష్ బాబు కలిసి ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో వేచి చూడాలి.