సంక్రాంతి విన్నర్ ఎవరు..!!!


సంక్రాంతి పండగ వచ్చిందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలతో ఫ్యాన్స్ కు కిక్కేకిక్కు. ఏడాది ముందే కొన్ని సినిమాలు పండగ బెర్తు దక్కించుకునేందుకు పోటీ పడతాయి. ప్రతి ఏడాది లాగా ఈ సంవత్సరం కూడా నాలుగు సినిమాలు ఈ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలూ ఉండటం అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అలాగే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా, తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’, దిల్ రాజునే పంపిణీదారుడిగా ఉన్న కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ కూడా ఈసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ నలుగురు స్టార్ హీరోల చిత్రాలు ఒకట్రెండు రోజుల తేడాలోనే విడుదల కానుండటంతో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనే దానిపై ఫ్యాన్స్ ఇప్పటికే బెట్టింగులు స్టార్ట్ చేశారు.

చిరు, బాలయ్య పోటాపోటీగా..
టాలీవుడ్ లో ఎనలేని స్టార్ డమ్ అందుకున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలంటే ఫ్యాన్స్ కు పూనకాలే. అలాంటిది వారిద్దరూ ఒకే పండగ బరిలో నిలుస్తుండటం బాక్సాఫీస్ దగ్గర కాక రేపుతోంది. ఇప్పటికే విడుదలైన చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రాల ట్రైలర్లు అంచనాల్ని అమాంతం పెంచేశాయి. బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు లుక్ అదిరిపోయింది. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కామెడీ పంచ్ లతో పాటు ఫైట్స్ లోనూ ఇరగదీశారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి సింహ సెంటిమెంట్ తో బరిలోకి దిగుతున్నారు. తనదైన మాస్ శైలి డైలాగ్స్ తో ఈ చిత్ర ట్రైలర్ కూడూ కుమ్మేసింది. దీంతో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ విన్నర్ గా నిలవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.

తమిళ సాంబార్ మరోసారి..
టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగుతున్న వేళ పండక్కి రెండు కోలీవుడ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. తలపతి విజయ్, తలా అజిత్ మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. విజయ్ వారసుడు చిత్రానికి దిల్ రాజు నిర్మాతగానూ, అజిత్ తెగింపు చిత్రానికి పంపిణీదారుడిగానూ వ్యవహరిస్తుండటంతో ఈ రెండు చిత్రాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతికి చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు.