ఇటీవలే ఇండియా, భారత్ అంటూ వ్యాఖ్యలు చేసి దుమారాన్ని రేపిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయని, భారత్లో కాదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించిన సంగతి, ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భగ్గుమన్న నిరసన పరంపరలు తెలిసిందే! ఈరోజు ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కావాలని అన్నారు. భార్యాభర్తలు సామాజిక సిద్ధాంతం ప్రకారం ఒప్పందానికి కట్టుబడి జీవించాలని ఆయన సూచించారు. సామాజిక సిద్ధాంతంప్రకారం భార్య ఇంటి బాధ్యతలు చూసుకుంటూ భర్తను సంతృప్తి పర్చాలని అప్పుడే ఆమె బాగోగులు, రక్షణ భర్త చూసుకుంటాడని అన్నారు. భర్త తన ఒప్పందాన్ని భార్య తన బాధ్యతలు నిర్వహించినంత కాలం కొనసాగించాలని చెప్పాడు. ఒప్పందం ప్రకారం ఒకరినొకరు గౌరవించుకోకపోతే, విడిపోయి కొత్త ఒప్పందాలను కుదర్చుకోవచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి.