నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్న బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ‘12 శాతం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఓ వర్గానికి కొమ్ముకాసే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని మత విద్వేషాలు రగిల్చే పార్టీ అని అంటున్నయ్. పక్కా రగిలిస్తాం. 80 శాతం ప్రజలున్న నా హిందువులను కించపరిస్తే వారి ఐక్యత, శ్రేయస్సు కోసం అవసరమైతే దేనికీ వెనుకాడబోం’’అని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో భాగంగా ఆరెమైసమ్మ ఆలయం వద్ద హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. శాసనసభాపక్ష నేత రాజాసింగ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, కర్నాటకలోని కోలార్ ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంచార్జీ మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇంఛార్జీ లాల్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీసీ కమిషన్ జాతీయ సభ్యుడు ఆచారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీయే కాదు….వాళ్లు సవాల్ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేసే దమ్మూధైర్యం మాకుంది. టీఆర్ఎస్ కు ఆ దమ్ము ఉందా?. దేశద్రోహులు సవాల్ చేస్తే కూడా స్పందించని దద్దమ్మ కేసీఆర్. దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో దోస్తీ చేస్తుండ్రు. కేసీఆర్ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమి తరిమి కొడతాం.

• భాగ్యనగర్ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండ తప్ప గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నరు. బీజేపీ 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులన్నీ స్వాధీనం చేస్తాం.

• తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీది అయితే…..తెలంగాణ ప్రజల మాన ప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్ఎస్ ది.

• తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడైనా ఎంఐఎం సమర్ధించలే. సుష్మా స్వరాజ్ వల్ల తెలంగాణ వచ్చింది. వందలాది మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది. వేలాది మంది జైలుకు పోయి తెలంగాణ కొట్లాడి సాధించుకున్నరు. తెలంగాణ కోసం కొట్లాడితే కేసీఆర్ పై ఎన్ని కేసులున్నయ్, ఆ కుటుంబంపై ఎన్ని కేసులున్నయో చెప్పాలి. మీ కుటుంబం ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నయో కేసీఆర్ చెప్పాలి.

• ఈరోజు ఒక కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యింది. వేలాది మంది అమరవీరులు, తెలంగాణ తల్లి ఘోషిస్తున్నరు. బందీ అయిన రాష్ట్రాన్ని విడిపించేందుకు బీజేపీ పోరాడుతోంది రావాలంటూ తెలంగాణ తల్లి కోరుతోంది.

• 111 జీవో రద్దు చేస్తానని, మూసీ నది సబర్మతి నదిలా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజలను మోసం చేసిండు. రైతుల దగ్గర తక్కువ రేటుతో ఎకరాల కొద్దీ భూములను కొని గజానికి రూ.50 వేల చొప్పున అమ్ముకుంటున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానికది. 111 జీవో పరిధిలోనే కేసీఆర్ కు, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు సామ్రాజ్యాలున్నాయి.

• కోకాపేట పరిధిలోని ప్రజలు చాలా కష్టాలు పడుతున్నరు. ఎస్సీ,ఎస్టీ, బీసీ ప్రజల స్థలాలను వేలం వేసే కుట్ర చేస్తున్నరు.

• తెలంగాణ ప్రజల సమస్యలపై, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే బీజేపోళ్లు మత విద్వేషాలు రగిలి పక్కా రగిలిస్తాం. 12 శాతం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఓ వర్గానికి కొమ్ము కాసే టీఆర్ఎస్ పార్టీ, ఆ వర్గం ఓట్లతోనే అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీలు ఎట్లయితయ్? 80 శాతం ప్రజలున్న హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు, వారిని ఆదుకునేందుకు బీజేపీ అండగా ఉంటుందే తప్ప వెనక్కుపోయే ప్రసక్తే లేదు. భయపడేది లేదు. గోల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసేందుకు కదం తొక్కేందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా.

• బీజేపీ ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునే సమస్యే లేదు. కేంద్రం అందిస్తున్న పథకాల్లో ముస్లిం, క్రైస్తవులుసహా అర్హులందరికీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.