ఉత్తర తెలంగాణ జిల్లాలకి భారీ వర్ష సూచన, అప్రమవుతున్న అధికారులు!

ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలలో నెలకొన్న పరిస్థితుల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

ఈ వీడియోకాన్ఫరెన్సులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ (రోడ్లు, భవనాల శాఖ), రజత్ కుమార్ (ఇరిగేషన్ శాఖ), ఫైర్ సర్వీసెస్ డిజి సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం. రిజ్వీ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, పురపాలక కమిషనర్ యన్. సత్యనారాయణ, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) నుండి దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.