జిహెచ్ఎంసిలో తిరిగి ప్రారంభం కానున్న కోవిడ్ కంట్రోల్ రూం

నగరంలో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. 24/7  ఈ కంట్రోల్ రూం పనిచేసేవిధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని అన్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున బయో వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని తగు నిబంధనల ప్రకారం తీసివేసేందుకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చేపట్టిన చర్యలపై తనిఖీలు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్ లను ఆదేశించారు. నగర పౌరులు ఉపయోగించిన ఫేస్ మాస్కులు రోడ్లపై వదిలేస్తున్నారని, ఇవి కూడా బయోమెడికల్ వ్యర్థాల కిందకు వస్తాయని తెలిపారు. గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్ తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు. కోవిడ్-19 సంబంధిత అంశాలపై నగరవాసుల అవసరాలను తీర్చడం, తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి జిహెచ్ఎంసిలో ప్రత్యేక నోడల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ…నగరంలో 310 ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో చెత్త నిల్వ కేంద్రాలు, 700 తక్కువ పరిమాణం గల చెత్త నిల్వ ప్రాంతాలు ఉన్నాయని, వీటిలో వచ్చే గార్బేజ్ ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెత్త తరలింపుకు వినియోగించే వాహనాలన్నీ ప్రతి రోజు ఉదయం 5 గంటలలోపే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించేలా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పెద్ద పరిమాణంలో చెత్త వచ్చే ప్రాంతాలపై ఎస్.ఎఫ్.ఏ లను నియమించి, ఎక్కడి నుండి ఆ చెత్త వస్తుందో, ఎవరు వేస్తున్నారన్న అంశాలను పరిశీలించి తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. వీధులను శుభ్రం చేసే కార్మికులకు చెత్తను సేకరించి సమీప గార్బేజ్ పాయింట్లను వేసేందుకు ప్రత్యేక బ్యాగ్ లను అందజేస్తున్నామని, దీని వల్ల గార్బేజ్ పాయింట్ల నుండి చెత్తను త్వరితగతిన తొలగించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొత్తగా 320 స్వచ్ఛ ఆటోలు వచ్చాయని, మిగిలినవి దశలవారిగా రానున్నాయని తెలిపారు. ఎంటమాలజి, ఇ.వి.డి.ఎం సిబ్బంది ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని విస్తృతంగా స్ప్రేయింగ్ చేపట్టామని తెలిపారు.