ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో మమత బెనర్జీ మూడోసారి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక రేపు(గురువారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.