తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్


తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న మంత్రికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలకు మరింత సేవనందించే శక్తిని‌ మోదీకి ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.