అథ్లెట్లకు భారీగా నగదు ప్రోత్సహకాలు ప్రకటించిన యోగి సర్కార్

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఆయా రాష్ట్రాల సీఎంలు భారీగా నగదు ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే యూపీ అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధిస్తే రూ.6 కోట్లు, రజతం గెలిస్తే రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే వారికి రూ.2 కోట్ల చొప్పున నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు, రజతానికి రెండు, కాంస్యానికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.10లక్షల చొప్పున నగదు ఇస్తామని సీఎం యోగి తెలిపారు.