నెఫ్ట్‌ లావాదేవీలకు 14 గంటల అంతరాయం, ఎప్పటినుండి అంటే ?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు జరిపే నెఫ్ట్‌(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్‌బీఐ నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.

నెఫ్ట్‌ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక అపడేషన్‌ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుంచి(అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉండవు. ఆర్‌టీజీఎస్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి’’అని ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారమిస్తాయని పేర్కొంది.