
Ranveer Singh: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు ఏ హీరో అందుకోని విధంగా ఏకంగా రూ. 325 కోట్ల భారీ రెమ్యునరేషన్ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజం అయితే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ నటుల జాబితాలో రణ్వీర్ అగ్రస్థానానికి చేరుకుంటారు. తాజా సమాచారం ప్రకారం.. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రానికి ఆయన ఒకేసారి ఫిక్స్డ్ శాలరీ తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారట.
నిజానికి ‘ధురంధర్’ రెండు పార్ట్స్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టులు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 3,200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ లాభాల్లో నుంచే రణ్వీర్ సింగ్కు ఆయన షేర్ కింద సుమారు రూ. 325 కోట్లు అందినట్లు సమాచారం. ఈ గణాంకాలు గనుక పూర్తిగా నిజమైతే.. భారతీయ సినీ రంగంలో ఇప్పటివరకు ఉన్న పారితోషికాల రికార్డులన్నీ తిరగరాసినట్లే అని ట్రేడ్ వర్గాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. గతంలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజినీకాంత్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలు అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ రికార్డులను రణ్వీర్ సింగ్ ఈ ఒక్క సినిమాతో అధిగమించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సరికొత్త మైల్స్టోన్ గురించిన వార్త హాట్ టాపిక్గా మారింది.
