
Piracy Scam : కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఇంట్లోనే హెచ్డీ క్వాలిటీలో చూసే పరిస్థితి ఏర్పడింది. థియేటర్కు వెళ్లకుండానే సినిమాలు ఫ్రీగా నెట్లో లభ్యమవుతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజం. గత ఏడాది కాలంలో భారతీయ సినిమా పరిశ్రమకు దాదాపు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లింది. పలు పెద్ద సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడ్డాయి. దీనిపై సినీ పరిశ్రమతో పాటు పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అసలైన నిందితుడు ఇంతవరకు చిక్కలేదు. కానీ ఇప్పుడు అసలైన దోషి పోలీసులకు చిక్కడమే కాకుండా, అతను గత ఏడాదిలో 40కి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సారిగా అరెస్ట్ అయిన నిందితుడు జాన కిరణ్ కుమార్ అనే ఏసీ టెక్నీషియన్. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అతడు ఎనిమిదేళ్ల క్రితం తల్లితో కలిసి హైదరాబాద్కు వచ్చి, బోరబండలో ఏసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఒక తమిళ వెబ్సైటు ద్వారా పార్ట్ టైం పని కోసం కలిసాడు. ఆ వెబ్సైటు అతనికి సినిమాలు థియేటర్లో రికార్డ్ చేసి పంపమని ఆఫర్ ఇచ్చింది. ప్రత్యేక యాప్ ఉపయోగించి సెల్ఫోన్ ద్వారా హెచ్డీ క్వాలిటీలో సినిమాలు రికార్డ్ చేసి, TamilMV తరహా వెబ్సైట్లకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించాడు. ఒక్కో సినిమాకు రూ. 30,000 నుంచి రూ.1 లక్ష వరకు వేశారు. మొత్తం రూ.50 లక్షల పైగా సంపాదించాడని పోలీసులు వెల్లడించారు.
అతడు రికార్డ్ చేసిన సినిమాలను అమెరికా డాలర్లు, బిట్కాయిన్లు వంటి క్రిప్టో కరెన్సీల్లో చెల్లింపులు పొందేవాడు. గత నాలుగేళ్లుగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను పైరసీ చేసి అమ్ముతూ వచ్చిన విషయం అతని ఫోన్ను అన్వేషించగా బయటపడింది. హైదరాబాద్లోని మాల్స్లో ప్రదర్శించే ఫస్ట్ డే ఫస్ట్ షోలకు వెళ్లి పై నుండి సినిమాలను రికార్డ్ చేయడం, ఆడియో మిక్సింగ్ చేయడం, వాటిని Tamil వెబ్సైట్లకు పంపించడం ఈ వ్యక్తి నైపుణ్యంగా చేసేవాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అతనికి సహకరించిన వెబ్సైట్లు, వారి ప్రతినిధులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
