Nagarjuna : నట కిరీటి నాగార్జున, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కథానాయకుడు. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ, తమకు విలన్గా అవకాశం వచ్చినప్పుడు దానిని ఎలా స్వీకరించాలో వివరించారు.
నాగార్జున మాట్లాడుతూ, “సినిమా సెట్స్పై ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేస్తుండాలి. అప్పుడే ప్రేక్షకులకు, నటులకు కూడా బోర్ కొట్టదు” అని చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి విజయం తర్వాత ‘అన్నమయ్య’ వంటి భక్తి ప్రధానమైన సినిమాలో నటించడంపై అప్పట్లో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేశానని, కొన్నిసార్లు దెబ్బలు తిన్నానని, మరికొన్నిసార్లు గొప్ప విజయాలు సాధించానని అన్నారు.
లోకేశ్ కనగరాజన్ ఒకరోజు తనని కలిసి, “మీరు విలన్గా చేయడానికి ఒప్పుకుంటేనే కథ చెబుతాను. లేదంటే టీ తాగేసి వెళ్లిపోతాను” అని చెప్పారని నాగార్జున తెలిపారు. ‘ఖైదీ’ సినిమా చూసిన తర్వాత లోకేశ్తో కలిసి పని చేయాలనే కోరిక బలంగా ఉండిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు.
‘కూలీ’ చిత్రంలో తాను పోషించిన ‘సైమన్’ పాత్ర గురించి మాట్లాడుతూ, “రజనీకాంత్ సార్ చెప్పినట్లు, ఎప్పుడూ మంచివాడిగానే నటించడం సరికాదు. ‘కూలీ’లో సైమన్ పాత్ర విలన్లా కనిపించినా, నిజానికి అది ఒక హీరో పాత్ర లాంటిది” అని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ లాంటి గొప్ప నటుడికి దీటైన పాత్ర ఉంటుందా అని తాను లోకేశ్ను అడిగినట్లు కూడా తెలిపారు. లోకేశ్ కనగరాజన్ చెప్పిన కథను రికార్డు చేసుకుని, కొన్ని మార్పులు సూచించగా, దానికి అనుగుణంగా సైమన్ పాత్రను తీర్చిదిద్దారని నాగార్జున వివరించారు.
ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. లోకేశ్ కనగరాజన్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారని కూడా నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నాగార్జున నటన ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

