Ahmedabad : జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 విమాన ప్రమాదంపై తొలి అధికార నివేదికను భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ప్రాథమిక నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
విమాన టేకాఫ్ అయిన వెంటనే, అంటే మూడే సెకన్లలో తీవ్ర ఇంజిన్ లోపం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇరుమోటర్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది.
నివేదిక ప్రకారం, ఇరువైపు ఇంజిన్ల ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లు “రన్” స్థితిలో నుంచి అకస్మాత్తుగా “కటాఫ్” స్థితికి మారాయి. దీనివల్ల ఇంజిన్లు ఒక్కసారిగా వేగం కోల్పోయాయి, విమానం ఎత్తు కోల్పోయింది. పైలట్లు వెంటనే “MAYDAY MAYDAY MAYDAY” అనే ఎమర్జెన్సీ సిగ్నల్ పంపించినప్పటికీ, ప్రమాదం తప్పలేదు.
కాకపోతే, క్రాష్ కుదరే కొద్దిసేపటి ముందు ఇంధన సరఫరా తిరిగి పునరుద్ధరమైనట్లు రికార్డు అయ్యింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. విమానం మొదట కొన్ని చెట్లు, ఒక చిమ్నీని ఢీకొట్టి, ఆ తర్వాత విమానాశ్రయం నుంచి 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న BJ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది.
కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఓ పైలట్ మరో పైలట్ను అడుగుతూ వినిపించాడు — “నువ్వేనా ఫ్యూయల్ కట్ చేసావ్?” అని. దానికి సమాధానంగా సహ పైలట్ — “నేను కాదు” అని చెప్పాడు.
ప్రమాద సమయానికి విమానం దాని గరిష్ట టేకాఫ్ బరువు దగ్గరలోనే ఉన్నదని, అదే సమయంలో ఇంజిన్ల విఫలమవడం వల్ల విమానం ఎత్తు పెంచుకోలేకపోయిందని నివేదిక చెబుతోంది.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. తుది నివేదిక విడుదలయ్యే వరకు మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

