
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దసరా పండగకు ముందుగానే ప్రభుత్వం బోనస్ను ప్రకటించేది. అయితే ఈ ఏడాది పండగ దగ్గర పడుతున్నప్పటికీ బోనస్ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. కొవిడ్ కారణంగా బోనస్ వస్తుందో, రాదో అనే అనుమానం నెలకొంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది.
