
తాజాగా మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తుగా ఓడి అభిమానులను తీవ్ర నిరాశపర్చిన విషయం తెలిసిందే. గత సీజన్లలో దూకుడుగా ఆడి ఐపీఎల్లోని మజాను రుచి చూపించిన ఆ జట్టు ఈ సారి మాత్రం ఘోరంగా విఫలం కావడం గమనార్హం. దీనిపై ఆ జట్టు కెప్టెన్ ధోనీ స్పందిస్తూ… తమ ప్రదర్శన పట్ల చాలా బాధపడుతున్నట్లు చెప్పాడు.
ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకోవాల్సి ఉందని, ఈ సీజన్లో తాము ఒకటి, రెండు మ్యాచ్లలోనే బాగా రాణించామని తెలిపాడు. రాయుడికి గాయమైందని, మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమవుతున్నారని చెప్పాడు. దీంతో వాళ్లపై ఒత్తిడి పెరిగిందని, టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించకపోతే మిడిల్ ఆర్డర్పై ప్రభావం చూపుతుందని చెప్పాడు.
క్రికెట్లో ఓటములు ఎదురవుతుంటే కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని ఆయన అన్నాడు, అయితే, ఈ సీజన్లో మాత్రం తమకు అలా జరగలేదని, తాము టాస్లు గెలవలేదని చెప్పాడు. దీంతో తాము కొన్నిసార్లు రెండో ఇన్నింగ్స్లో ఆడాల్సి వచ్చిందని, అప్పుడు తేమ కూడా ప్రభావం చూపలేకపోయిందని చెప్పుకొచ్చాడు.
