
దేశంలో ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా వైరస్ నిరోధక టీకా అందుతుందని పుణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వైద్యారోగ్య సిబ్బందికి, వృద్ధులకూ ఫిబ్రవరి 2021లోగా అందుతుందని.. ఇక ఏప్రిల్లో సాధారణ ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభమౌతుందని అన్నారు.
కాగా, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే రెండు వ్యాక్సిన్ మోతాదులకుగాను సుమారు రూ.1000 ఖర్చుకాగలదని ఆయన అంచనా వేశారు. పూర్తి దేశానికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందేందుకు కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని పూనావాలా వివరించారు. వ్యాక్సిన్ సరఫరా, పంపిణీల్లో గల పరిమితులు, బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు
