
భారత్లో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993కేసులు నిర్ధారణ కావడంతోపాటు 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారిసంఖ్య 1147కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 35,043కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కాగా భారత్లో మే 21 నాటికి కరోనా వైరస్ అదుపులోకి రావచ్చని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఓ అధ్యయనంలో తేల్చి చెప్పింది.
లాజిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో భారత్లో కరోనా లెక్కలను అంచనా వేసి ఈ ఫలితాలు వెల్లడించారు. కరోనా వైరస్ మొదట విజృంభించి, గరిష్ఠ స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నట్లు వివిధ దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే తెలిసిందని చెప్పారు.
