
కరోనా వైరస్ ఒక్కటే రావడం లేదు…ఈ మహమ్మారి తనతో పాటు అనేక అనారోగ్యాలను వెంట తెస్తోంది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో విభ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
లివర్పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో గుండె జబ్బులు, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

