
కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బాగంగా ఆయుర్వేద మూలిక అశ్వగంధపై ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది.
హైడ్రాక్సీ క్లోరిక్విన్తో పోలిస్తే కొవిడ్-19ను అడ్డుకోవడం, నియంత్రించడం, నయం చేయడంలో ఎంత సమర్థంగా పనిచేయనుందో తెలుసుకోనుంది. సీఎస్ఐఆర్ సాంకేతిక సిబ్బంది, ఐసీఎంఆర్ సహాయంతో ఆయుష్, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ ట్రయల్స్ చేపట్టనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా మాట్లాడుతూ, కరోనా లక్షణాలు స్వల్పంగా, కాస్త ఎక్కువగా ఉన్న రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి, పిప్పలి, పాలా హెర్బల్ ఫార్మలేషన్ (ఆయుష్64) ఇస్తారని చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా… వస్తే వాటిని నివారించేందుకు ఈ క్లినికల్ ట్రయల్స్ ఉపయోగపడతాయని తెలిపారు.
