Site icon TeluguMirchi.com

రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

Kindindia water plant
పేద పిల్లలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ‘కైండ్ ఇండియా’ ఫౌండేషన్ కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో/యూవీ నీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంటే పిల్లల్లో అనారోగ్యం తగ్గి, పాఠశాలకు హాజరు శాతం పెరగడమే కాకుండా వారి విద్యా ప్రగతిపై కూడా మంచి ప్రభావం చూపుతుందని సంస్థ భావిస్తోంది.

తాజాగా బోరబండలోని నాట్కో గవర్నమెంట్ హై స్కూల్ మరియు ప్రభాత్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండు యూవీ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లను కైండ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ కుందా ప్రతాప్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పైపింగ్ సిస్టమ్, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, గంటకు 1000 లీటర్ల సామర్థ్యంతో పనిచేసే యూవీ యంత్రాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంకులు, విద్యార్థులకు సులభంగా నీరు అందేలా అనేక ట్యాపులు ఏర్పాటు చేశారు. ఈ రెండు పాఠశాలల కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ ఆర్వో/యూవీ ప్లాంట్ల ద్వారా 1,800కు పైగా విద్యార్థులు మరియు సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ఐదు పాఠశాలల్లో ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన కైండ్ ఇండియా ఫౌండేషన్, బోరబండతో పాటు నాచారం, మౌలాలి తిరుమల నగర్ ప్రాంతాల్లో కూడా సేవలను విస్తరించింది. వచ్చే ఏడాదిలో 100 ఆర్‌ఓ సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. మరిన్ని వివరాల కోసం www.kindindia.in ను సందర్శించవచ్చు.

Exit mobile version