
యాంకీలూజింగ్ స్పాండిలైటిస్ అనే అరుదైన వైకల్యం కలిగిన ఓ వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తిన్నగా నిలబడగలిగేలా మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. మేరీ-స్ట్ర్ంపెల్ స్పాండిలైటిస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి అత్యంత అరుదైన ఆర్థరైటిస్. దీనివల్ల వెన్నెముక వంగకుండా బిగుతుగా అయిపోతుంది. దానివల్ల నడుం విపరీతంగా నొప్పి పుడుతుంది. దీనివల్ల మనిషి శరీరంలో ఇతర భాగాలు కూడా క్రమంగా పాడవుతాయి. ఫలితంగా రోగి తిన్నగా నిలబడలేడు.
గుజరాత్లోని బరోడా నగరానికి చెందిన ఫరాజ్ అనే 32 ఏళ్ల వ్యక్తి సుమారు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి తన వెన్నెముక చుట్టుపక్కల ప్రాంతాలు గట్టిగా అయిపోయినట్లు గుర్తించాడు. దీనివల్ల గత 15 ఏళ్లుగా అతడు వంగే ఉంటున్నాడు. ఇన్నేళ్ల నుంచి అతడి సమస్యకు సరైన చికిత్స పొందలేకపోయాడు. ఇటీవల అతడి కుటుంబ స్నేహితుల్లో ఒకరు హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రికి రావడంతో ఇక్కడ చికిత్స ఉందని తెలిసి అతడికి తెలిపారు.
ఈ సమస్య గురించి, తాము చేసిన శస్త్రచికిత్స వివరాల గురించి మెడికవర్ ఆసుపత్రి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ వోలేటి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, “యాంకీలూజింగ్ స్పాండిలైటిస్ వల్ల ఫరాజ్ చాలావరకు వంగిపోయాడు. దానివల్ల అతడి వ్యక్తిగత శుభ్రత కూడా తీవ్రంగా దెబ్బతింది. కాలం గడిచేకొద్దీ పరిస్థితి మరింత విషమించి చివరకు అతడి వెన్నెముక బీటలు వారే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే శాశ్వత వైకల్యం లేదా పక్షవాతం సంభవిస్తాయి. అతడికి అవసరమైన అన్నిరకాల వైద్యపరీక్షలు చేసిన తర్వాత రోగిని శస్త్రచికిత్స కోసం తీసుకెళ్లాము. అతడి వెన్నులోని ఎముకలు బాగా బిగుతుగా అయిపోయాయి. దానివల్ల ఆపరేషన్ బల్ల మీద అతడిని సరైన స్థితిలోకి తెచ్చి, ఎండోట్రాకియల్ ట్యూబ్ పెట్టడం అనేది మత్తువైద్య నిపుణుడికి చాలా పెద్ద సమస్య అయ్యింది.”
“దాంతో అతడికి మత్తు ఎక్కడం కోసం వీడియో లారింగోస్కోప్ ఉపయోగించి మత్తుమందు ఎక్కించారు; శస్త్రచికిత్స సమయంలో అతడిని పడుకోబెట్టిన తీరు కారణంగా శరీరంలోని కీలక అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా ప్రతి సందర్భంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. 8 గంటల పాటు సుదీర్ఘంగా శస్త్రచికిత్స చేసిన తర్వాత వైకల్యాన్ని పూర్తిగా సరిచేశాం. రోగి వెన్నెముక మామూలు పరిస్థితిలోకి వచ్చింది. దాంతో రోగి ఎత్తు కూడా నాలుగు అంగుళాలు పెరిగారు” అని డాక్టర్ సూర్యప్రకాష్ రావు వివరించారు.
నవంబర్ 12వ తేదీన రోగికి శస్త్రచికిత్స చేయగా, పూర్తిగా కోలుకున్న తర్వాత 25వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఫరాజ్ ఇప్పుడు సమాజంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాధారణ జీవితం గడపగలడు. అత్యంత సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు విజయవంతంగా చికిత్సలు చేయగలిగిన అత్యుత్తమ సదుపాయాలున్న ఆసుపత్రులలో దేశంలోనే ఒకటిగా మెడికవర్ ఆసుపత్రి ఆవిర్భవించింది.
