
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కనీసం సరైన ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు , రాజకీయ నేతలు , సినీ , క్రీడా మొదలగువారంతా ప్రజలకు నిత్యావసరాలను అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. తాజాగా భువనగిరి పట్టణానికి చెందిన దాదాపు రెండు వేల మంది ఆటో డ్రైవర్లకు ఆ నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. అయితే, ఈ కార్యక్రమం పూర్తిగా రసాభాస అయ్యింది.
నిత్యావసర సరుకులతో వచ్చిన డీసీఎం వాహనం వద్దకు అంతా లైన్లో రావాలని అక్కడి వారు సూచించినప్పటికీ అక్కడి జనం ఏమాత్రం పట్టించుకోకుండా డీసీఎం పైకి ఎక్కి ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. సామాజిక దూరం, మాస్కులు వంటి నిబంధనలేవీ లేకుండా సరకులన్నింటినీ లూటీ చేసి ఎత్తుకుపోయారు. వీరి తీరును చూసిన పోలీసులు లాఠీకి పని చెప్పారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం భువనగిరిలో జరిగింది.
