
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించిన కేంద్రం.. ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో అయితే మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగించనుంది.
కాగ గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు, పాన్ దుకాణాలకు ఓకే చెప్పింది. అయితే, విధిగా ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, దుకాణం వద్ద ఒక్కసారి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువమంది ఉండరాదని స్పష్టం చేసింది. ఇది గ్రీన్ జోన్ల వరకే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. కరోనా కేసులు అధికంగా ఉండే రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని, ఓ మోస్తరు కేసులుండే ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది.
