Site icon TeluguMirchi.com

‘గిడుగు’ పేరుతో జనసేన కొత్త ఆఫీస్


జనసేన పార్టీకి సంబంధించిన మరో కొత్త కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభమైయింది. ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ పేరుతో నూతన కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు తెలుగు భాష అంటే ఎనలేని మక్కువ. తెలుగు భాషా ప్రియుడు పవన్ కళ్యాణ్. అలాగే తెలుగు భాషను పరిరక్షించడానికి తనవంతు సాయం చేయడానికి కూడా ఎప్పుడూ ముందుటారాయన. గతంలో తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణ కోసం అక్కడి ప్రజలకు అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ‘నిర్బంధ తమిళం’ జీవో కారణంగా తమిళనాడులో మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ నిరసన దీక్ష చేపట్టింది. రాజకీయాలను పక్కన పెట్టి కేవలం తెలుగు భాషపై వున్న మమకారంతో ఆ దీక్షకు మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి స్పందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇదీ తెలుగు భాష పరిరక్షణ పట్ల ఆయనకి వున్న నిబద్ధత.

ఇప్పుడు మరోసారి తెలుగు భాషపై తన మమకారంను చాటుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన సమాచార కార్యాలయానికి ‘గిడుగు వెంకట రామ్మూర్తి పంతులుగారి పేరు పెట్టారు. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ‘గిడుగు’ వారిని మరోసారి గుర్తు చేస్తూ జనసేన కొత్త కార్యాలయానికి ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్. సమాచార సేకరణ, విశ్లేషణ, పార్టీ శ్రేణులకు సమాచారం అందించడం, లైబ్రెరీ నిర్వహణ, నిరంతర సమాచారం,మొదలైనవి ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ లోని (GVRIC) కీలక విధులు.

Exit mobile version