Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లా రోజుకో మాట తాము మాట్లాడలేమని, ఊసరవెల్లిలా మారలేమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. నిన్న భీమవరం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.

కాగా పవన్ మాటలపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. గాజువాక సభలో పవన్ మాట్లాడుతూ, వైసీపీని గెలిపిస్తే భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్టే అనడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని కూడా నాగిరెడ్డి, గౌతంరెడ్డి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు వైసీపీకి ఓటేయొద్దని చెబుతూ కరపత్రాలు కూడా ముద్రించి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Exit mobile version