కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండ్రోజుల పాటు ఉపయోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశించిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐసీఎంఆర్కు లేఖ రాసింది. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఉపయోగించి నిర్వహించిన కరోనా టెస్టుల్లో కేవలం 5.4 శాతం మాత్రమే కచ్చితత్వం వచ్చిందని, 94.6 శాతం ఫలితాల్లో కచ్చితత్వం లేదని తెలిపింది.
ఇదీలావుంటే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమతి చేసుకోగా వాటిని మళ్లీ వెనక్కి పంపించేందుకు చర్యలు చేపట్టింది. చైనా టెస్టింగ్ కిట్స్ లో లోపాలు తలెత్తుతున్నాయన్నా ఆరోపణ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.









