
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3244 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,756 చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 87 మరణాలు సంభవించగా.. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 2293 మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వైరస్ సోకినవారిలో ఇప్పటివరకు 22,454 మంది కోలుకోగా మరో 46,008 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న తీరు, రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.









