
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 02 న థియేటర్స్ లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం థియేటర్స్ లలోనే కాదు ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. అయితే ఈ మూవీ చివర్లో అప్పట్లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని.. బోయపాటి హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన అఖండ 2 కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ నేపథ్యంలో ఓ మూవీని తీయాల్సి ఉంది. దీన్ని వచ్చే ఎన్నికలకు విడుదల చేద్దామని భావించారు. కానీ అఖండకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా దీన్నే ముందు తీస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ మూవీకి ప్రస్తుతం కథను సిద్ధం చేస్తుండగా.. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది ముగిశాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తరువాతే అఖండ 2 లాంచ్ అవుతుంది. అఖండ2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కనుకనే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీకి భారీగా బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక కథ కూడా పూర్తిగా అఘోరాల మీదే ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షాక్ చేయడం ఖాయం.









