SS Rajamouli: అనుకున్న టైంకే రానున్న ‘వారణాసి’? రాజమౌళి కీలక అప్డేట్

SS Rajamouli

SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది.

తాజాగా సినిమా షూటింగ్‌పై జక్కన్న ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. “ఈ సినిమా షూటింగ్‌లో ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తైంది. మిగిలిన 20 శాతం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. సినిమాలోని అతిపెద్ద యాక్షన్ సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశాం. ఇప్పుడు చిన్న సన్నివేశాలు, వాటి మధ్య ఉండే కీలక భాగాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది” అని ఆయన వెల్లడించారు. రాజమౌళి వ్యాఖ్యలతో ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి చేసుకుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లు పూర్తవడం వల్ల మిగిలిన చిత్రీకరణను కూడా త్వరగా పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై మేకర్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి వెల్లడించిన తాజా షూటింగ్ అప్డేట్‌తో సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మరింత బలపడినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.