
పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధ్రువీకరించారు.
లాహోర్ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 90 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది.









