నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ పై ఫైరయ్యారు. గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆమె తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్షకు దిగారు.
దీనిపై స్పదించిన కవిత ఆమెపై విరుచుకుపడ్డారు. డీకే అరుణను బొమ్మాళిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద డీకే అరుణ నోరు పారేసుకోవడం మంచిది కాదని, దానికి బదులుగా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఎలా చేస్తే మంచిదో కేసీఆర్ కు బాగా తెలుసని చెప్పుకొచ్చారు కవిత.