
Telangana : దేశంలోని పలు హైకోర్టులకు కొత్తగా 19 మంది న్యాయమూర్తులు మరియు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం నుంచి వచ్చిన సిఫారసులను పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ నియామకాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నియామకం పొందిన వారిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులుగా గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.
అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు, నలుగురు అదనపు న్యాయమూర్తులు, గౌహతి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు నియమించబడ్డారని కేంద్రం వెల్లడించింది. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఉన్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.









