Delhi Explosion : ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 8 మంది మృతి

Delhi explosion
Delhi Explosion : ఢిల్లీలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం ఎర్రకోట (లాల్‌ఖిలా) సమీపంలో ఈ రోజు(సోమవారం) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నం.1 దగ్గర నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండటంతో సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి. పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Also Read :  TamilNadu Politics : అన్నామలై రాజీనామా బీజేపీకి కలిగే నష్టం ఇదే..

Delhi explosion1

వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఇది ప్రమాదవశాత్తూ జరిగినదా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన పేలుడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్‌ టీమ్‌లు సంఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరిస్తున్నాయి. రెడ్‌ఫోర్ట్‌ పరిసర ప్రాంతం దేశవ్యాప్తంగా పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతం కావడంతో ఈ పేలుడు దేశ భద్రతాపరంగా ఆందోళన కలిగించింది. కేంద్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.

Also Read :  West Bengal : బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ సంక్షోభానికి అసలు కారణం ఇదేనా?

ఈ ఘటన తరువాత ఢిల్లీ నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. రాజధాని పరిసర ప్రాంతాలు నోయిడా, ఘాజియాబాద్‌, గురుగ్రామ్‌ లో కూడా భద్రతా బలగాలను మోహరించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, మెట్రో మార్గాలు, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కఠిన తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని, రూమర్స్‌ లేదా నిర్ధారణ లేని సమాచారం సోషల్‌ మీడియాలో పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అధికారిక వర్గాల నుంచి వచ్చే అప్‌డేట్స్‌ మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.