రేపు ఆలయాల మూసివేత

రేపు సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసివేస్తున్నారు. ఆదివారం ఉదయం 10:18 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు ఈ గ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్బంగా ఈరోజు రాత్రి 8.30 గంటలకు బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం మూసివేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తెరవనున్నారు. రేపు అమ్మవారి ఆలయం సంప్రోక్షణ చేసిన అనంతరం సా.4.30 గంటల నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

తిరుమల దేవస్థానం సైతం ఈ రోజు రాత్రి 8. 30 నుంచి రేపు మధ్యాహ్నం 2.30 వరకు మూసి ఉంటుందని టీటీడీ బోర్డు తెలిపింది. రేపు మధ్యాహ్నం ఆలయ శుద్ధి తర్వాత స్వామి వారికి ఏకాంతంగానే పూజలు నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. అలాగే సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం కూడా సూర్యగ్రహణం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు మూసివేయనున్నారు. తిరిగి రేపు సాయంత్రం 4:30 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.