
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తమ సత్తా చాటుకునేందుకు చివరి వరకు శ్రమించాయి. మొత్తం మీద మున్సిపాలిటీల్లో ఎవరి ఆధిపత్యం కొనసాగనుందో తేల్చే సమయం ఆసన్నమైంది. ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడుతలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల సంఘం పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉండగా, ఇతర ఓటర్లు 640 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 16,031 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. భద్రత దృష్ట్యా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయగా, ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు, ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.









