Ayesha : బిగ్ బాస్ 17 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయేషా ఖాన్, తన గ్లామరస్ లుక్, ఫ్యాషన్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ వస్తోంది. వాస్తవానికి ఆమె పోస్టులు ఫ్యాషన్ పట్ల ఆమెకు ఉన్న అభిరుచిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎలిగెంట్ సారీస్ నుండి ట్రెండీ గౌన్ల వరకు ఆమె ధరిస్తున్న ప్రతి వేషం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం… కాశ్మీరీ రచయిత జలీస్ హైదర్ రాసిన ఓ పోస్టుకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ‘లైక్’ ఇవ్వడం. ఆ పోస్టులో కాశ్మీర్ను పర్యాటక ప్రదేశంగా చూపించడం వెనక ఉన్న రాజకీయ, సామాజిక వాస్తవాలను విమర్శిస్తూ, “ఇది ప్రపంచంలోనే అత్యధికంగా మిలిటరీ బలగాలు ఉంచిన ప్రాంతం” అంటూ పేర్కొన్నారు. అదే సమయంలో, అక్కడి ప్రజల బాధలను విస్మరించి పర్యాటకులు రొమాంటిక్గా ఆ ప్రాంతాన్ని చూడడాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు.
ఈ పోస్టుకు ఆయేషా ఇచ్చిన ‘లైక్’ ఒక్కటే చాలిందీ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడానికి. పలువురు ఆమెపై దేశభక్తి లోపించిందని మండిపడ్డారు. అలాగే, ఆమె త్వరలో నటించనున్న దిల్ కో రఫూ కర్ లే అనే షోకి సంబంధించి నిర్మాత రవి దూబేను ట్యాగ్ చేస్తూ, ఆమెను తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు, ఆమెపై అధికారుల దృష్టి పడాలని కోరుతూ పోస్టులు పెట్టారు.
ఇంకా ఆయేషా ఖాన్ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘటన పబ్లిక్ ఫిగర్స్ ఎలా చిన్న చర్యల వల్ల కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందో మరోసారి స్పష్టంగా తెలియజేసింది.













