Meera Mithun : బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి మీరా మిథున్పై మళ్లీ కేసు ముమ్మరమైంది. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తమిళనాడు న్యాయస్థానం ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2021 ఆగస్టులో వీసీకే తరపున వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై పోలీసులు మీరా మిథున్తో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ను అరెస్టు చేశారు. నెలరోజుల తర్వాత ఇద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే, కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో 2022లో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయ్యింది. మూడు సంవత్సరాలుగా ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ఇటీవల ఈ కేసుకు మలుపు తిప్పిన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తిరుగుతున్న తన కూతురిని రక్షించాలంటూ మీరా మిథున్ తల్లి కోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో పోలీసుల తరఫున న్యాయవాది మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు మీరా మిథున్ను రక్షించి స్థానిక హోంకి తరలించారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్ను అరెస్టు చేసి ఈ నెల 11న కోర్టులో హాజరుపరచాలని చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు.










