
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్ధన’ అధికారికంగా ప్రకటించబడింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ను హైదరాబాద్లో అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్గా విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్లో విజయ్ దేవరకొండ ఊహించని స్థాయిలో ఊరమాస్ అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. కండలు తిరిగిన దేహం, ఒళ్లంతా రక్తపు మరకలు, చేతిలో కత్తితో కనిపించిన లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, రాజశేఖర్ కనిపించనున్నారు. “ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే… వాడే జనార్ధన.. రౌడీ జనార్ధన” అనే పవర్ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల్లో మాస్ ఉత్సాహాన్ని పెంచుతోంది. 1980వ దశకంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్బ్యాక్ ఇవ్వనున్నాడనే అంచనాలు భారీగా ఉన్నాయి.











