‘మై డియర్ మార్కండేయ’.. మనల్ని ఎవడు ఆపేది ఇక !


తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి మొదటి సింగిల్ విడుదలైంది.

మై డియర్ మార్కండేయ పాట “కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో” అంటూ ట్రెండీగా ప్రారంభమైంది. స్టైలిష్ అవతార్‌లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ తనదైన నాట్యంతో ఆకట్టుకున్నారు. తన చరిష్మాతో తెరకు నిండుతనం తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ రాకతో పాట ఊపందుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్రలేచి ప్రతిరోజు పండగ చేసుకో..” అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇకపోతే ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లపై తెరకెక్కించిన ‘మై డియర్ మార్కండేయ’ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. చిత్రం కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించబడింది. సమయం మరియు జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరూ కాలు కదిపేలా ఉంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.