Sundeep Kishan: ‘అర్జున్ రెడ్డి’కి ముందు సందీప్ కిషన్‌తో వంగా సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే?

Sundeep Kishan

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా నేను కలిసి సినిమా చేయాలని అనుకున్నామని, అందుకోసం దాదాపు ఏడాది పాటు కలిసి ప్రయాణించినట్లు తెలిపారు.

‘‘సినిమా చేయాలని అనుకున్నాం. ఒక సంవత్సరం పాటు కలిసి ట్రావెల్ చేశాం. కానీ ఆ కథ సెట్ కాలేదు. దీంతో మేమిద్దరం వేరే దారుల్లోకి వెళ్లిపోయాం. ఆ తర్వాత ఆయన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశారు’’ అని సందీప్ కిషన్ వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ 2017లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో వంగా ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తన మార్క్‌ను మరింత బలపర్చుకున్నారు. ఇక సందీప్ కిషన్, జాసన్ సంజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడిగా జాసన్ సంజయ్‌కు ఇదే తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.