
13వ సీజన్లోనూ బెంగళూరు వైఫల్యం చెందడంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని తీసేయాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి ఎలిమినేటర్ మ్యాచ్లో కోహ్లీసేన హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో టీ20మెగా క్రికెట్ లీగ్లో బెంగళూరు మరోసారి విఫలమైంది. ఫైనల్ చేరి కప్పు సాధించాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్.. కోహ్లీని కెప్టెన్గా కొనసాగించొద్దని చెప్పాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నాడు.
‘ఒక్కసారి కూడా విజయం సాధించకుండా 8 ఏళ్లు కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్ని చూడండి. పంజాబ్కు రెండేళ్లే కెప్టెన్గా ఉన్నాడు. ఫలితం లేకపోవడంతో తప్పించారు. మనం ఎలాగైతే రోహిత్, ధోనీ గురించి మాట్లాడతామో కోహ్లీ కూడా అంతే. ధోనీ చెన్నైకి మూడు సార్లు, రోహిత్ ముంబయికి నాలుగుసార్లు టైటిల్స్ అందించారు. అందుకే వారిని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు.. కానీ విరాట్ కి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.” అని చెప్పుకొచ్చారు.









