
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి పెను సవాల్ గా మారింది. నెలల తరబడి అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోవడం వల్ల ప్రతి దేశమూ ఒడిదుడుకుల్లో పడింది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం తలుపు తట్టినవారిని అక్కున చేర్చుకున్న దేశాలే… వారి స్వేదంతో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న దేశాలే ఇప్పుడు వెనక్కిపొమ్మని హుకుం జారీ చేస్తున్నాయి.
అందుకోసం రకరకాల నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అందరూ భయపడుతున్నట్టే కువైట్ కూడా విదేశీయుల సంఖ్యను నియంత్రించే ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. దాని ప్రకారం కువైట్ దేశ జనాభాలో భారతీయులు 15 శాతం మించకూడదు. ఆ దేశ జనాభా 43 లక్షలు. అందులో భారతీయులు14.5 లక్షలు. ఇది చట్టమైతే వారిలో దాదాపు 8 లక్షలమంది నిష్క్రమించక తప్పదు.









