
ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలు కరోనా ఫై పెద్ద యుద్ధమే చేస్తున్నప్పటికీ రోజు రోజుకు పాజిటివ్ ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
పలు రాష్ట్రాలు, నగరాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధనలు అమలుచేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఉత్తర్వులు జారీచేశారు. ఒడిశాలో మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.200 జరిమానా.. దీనిని మూడుసార్లు వరకు పరిమితం చేశారు. నాలుగోసారి ఉల్లంఘిస్తే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తప్పనిసరిగా మాస్క్ నిబంధనలు జారీచేసింది. నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్క్ ధరించాలని, దీనిని ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి లేదా మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు.









