
కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో ప్రధాననిందితుడైన వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లోని ఓ గుడివద్ద నేటి ఉదయం అరెస్టు చేశారు. ఉత్తర్ప్రదేశ్లో అతని ఇద్దరు ప్రధాన అనుచరులు ఎన్కౌంటర్లో మరణించిన సమయంలోనే వికాస్ దూబేను అరెస్టు చేసినట్లు సమాచారం.
ఉజ్జయిన్లోని ఓ ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ విచారించగా తప్పుడు ఐడీ కార్డు చూపించడంతోపాటు వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.









