
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా కు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్ , పారిశుద్ధ్య ఇలా చాలామంది దీనిబారిన పడి చనిపోతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
నిన్న, మొన్న తిరుపతి, అనంతపురంలలో సర్కిల్ ఇన్స్సెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరమన్నారు పవన్. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూయడం దిగ్భాంతికరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా మృతి చెందిన వారి పేర్లతో నివాళి అర్పించలేని నిస్సహాయ స్థితి మనది.. డిపార్టుమెంటులో మంచి పేరు పొంది, ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు పోలీస్ అధికారులు అకాల మరణం చెందడం మాటలకు అందని విషాదమన్నారు.
క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రతి ఒక్కరు ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అజాగ్రత్త జరిగినా విలువైన ప్రాణాలను హరించి వేస్తుందన్నారు. పైస్థాయి అధికారులు సైతం తమ సిబ్బంది ఆరోగ్య భద్రతా విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవలసి ఉందని అభిప్రాయపడ్డారు. పీ.పీ.ఈ. కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా నష్టపరిహారం అందించాలని కోరారు. పోయిన మనిషిని ఎలానూ తెచ్చి ఇవ్వలేము కనీసం వారి కుటుంబాలకు వారు లేని లోటు తీర్చ్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. విధి నిర్వహణలో అశువులు బాసిన ఇరువురు పోలీస్ అధికారులకు, వైద్యులకు తన తరపున, జనసేన పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.









