
రాజస్థాన్లో రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఇంకా తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరోవైపు సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన కారణంగా సచిన్ పైలట్తోపాటు మరో 18మంది రెబల్ ఎమ్మెల్యేలకు సభాపతి ద్వారా కాంగ్రెస్ నోటీసులు జారీ చేసింది.
అనర్హతపై స్పీకర్ ఇచ్చిన నోటీసులపై సచిన్ పైలట్ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఆయన లీగల్ టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే దారిలో రెబల్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. మరోవైపు మెసేజ్, వాట్సాప్, ఈ మెయిల్, పోస్టు ద్వారా పార్టీ నోటీసులు చేరవేసిన కాంగ్రెస్, తాజాగా రెబల్ ఎమ్మెల్యేల ఇంటికి నోటీసులు అంటించింది. శుక్రవారంలోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.









