Detective Teekshana : ‘డిటెక్టివ్ తీక్షణ’ నుండి ‘రేజ్ ఆఫ్ తీక్షణ..’ విడుదల !!


యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం గా ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎస్ డి సి సినీ క్రియేషన్స్ బ్యానర్ ల పై ఖర్చుకి వెనుకాడకుండా నిర్మించారు.

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ గా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచగా.. నేడు టీమ్ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘రేజ్ ఆఫ్ తీక్షణ..’ ను విడుదల చేశారు.

“రణరణమున రధము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి.. కుత్తుకల కోట కూల్చే తీక్షణా.. కణకణమున యుద్ధ నీతి, కనికరమే లేని యువతి, క్రూర కథల కత్తివేటు తీక్షణా..” అంటూ సాగే ఈ ఎనర్జిటిక్ సాంగ్ లో తీక్షణ తను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే తీరుని రేజ్ ఆఫ్ తీక్షణ పాట రూపంలో వివరించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతం పెద్దపల్లి రోహిత్ అందించగా, హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. శక్తి గ్రఫిస్టే క్రియేట్ చేసిన లిరికల్ వీడియో కూడా ఆకట్టుకునే యానిమేషన్ తో, ఆసక్తికరమైన మేకింగ్ వీడియో తో రూపొందించారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘డిటెక్టివ్ తీక్షణ’ ను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా, వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర, అవినాష్, మంజునాథ హెగ్డే, ముని వెంకట చరణ్, విజయ్ సూర్య, సిడ్లింగు శ్రీధర్ మరియ తదితరులు ప్రధాన తారాగణం.