Child Marriage : 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసిన తల్లి..

Child marriage
Child Marriage : ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు, సామాజిక చెడు సంప్రదాయాలు మాత్రం సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. బాలికల భవిష్యత్తును నిలువనిర్మూలం చేసే బాల్య వివాహాలు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో జరగడం విషాదకరం. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసారు.

రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళకు ఒక కూతురు,కుమారుడు ఉన్నారు. భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఆమె కూతురు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కుటుంబ పోషణ భారమవడంతో కూతురికి పెళ్లి చేసేందుకు మధ్యవర్తిని సంప్రదించగా.. అతను రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం కందవాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40 ఏళ్ళు) కు ఆస్తి బాగా ఉందంటూ సంబంధం తెచ్చాడు. దీంతో మే 28న వివాహం జరిపించారు.

చదువు మానేసి ఇష్టం లేని పెళ్లి చేయడం తనకు న్యాయం కాదని భావించిన ఆమె, ధైర్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. ఆయన నందిగామ తహసీల్దార్‌ వద్దకు బాలికను తీసుకెళ్లగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, 40 ఏళ్ల వ్యక్తి, మధ్యవర్తి, పెళ్లి జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.