CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో అన్ని తెలుగు రాజకీయ నాయకులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు వామపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి, తెలుగు వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి స్థానానికి గెలిపించాలని కోరారు.
పీవీ నరసింహారావు తర్వాత ఇలాంటి గౌరవం మరల తెలుగు వ్యక్తికి దక్కడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, దానికోసం రాజ్యాంగ నిపుణుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి కావడం అత్యవసరమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని, ఓట్లను దొంగిలించి దేశాన్ని పరిపాలించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఒకే బాటలో నడవాలని పిలుపునిచ్చారు.













